పాక్ గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ Jyoti Malhotra జ్యోతి మల్హోత్రా లాహోర్లో పర్యటిస్తున్న సమయంలో ఆరుగురు గన్మెన్లతో భద్రత పొందిన ఘటనపై స్కాటిష్ యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె లైఫ్స్టైల్, ఆర్థిక లావాదేవీలపై భారత పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పాక్ పర్యటనలో చోటుచేసుకున్న మరొక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. లాహోర్లోని అనార్కలీ బజార్లో పర్యటిస్తున్న సమయంలో ఆమెకు ఏకంగా ఆరుగురు గన్ మెన్లు ఏకే-47 తుపాకులతో భద్రత కల్పించినట్లు వీడియోల్లో కనిపించింది.
స్కాటిష్ యూట్యూబర్ ఆశ్చర్యం
“కాలమ్ అబ్రాడ్” అనే యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తున్న స్కాట్లాండ్కు చెందిన కాలమ్ మిల్ తన పాక్ పర్యటన సమయంలో ఈ ఘటనను రికార్డ్ చేశారు. ఆయన మాట్లాడుతూ – “ఆమె చుట్టూ ఆరుగురు గన్ మెన్లు ఉన్నారు. ఇది ఎంతటి భద్రత? ఎందుకు?” అంటూ తన ఆశ్చర్యాన్ని వీడియోలో పంచుకున్నారు. గన్మెన్లకు “నో ఫియర్” అనే పదాలతో ఉన్న చొక్కాలు కనిపించాయి.
పాక్లో జ్యోతి సుస్థిర సంబంధాల సంకేతాలు
ఈ భద్రతా ఏర్పాట్లు పాక్లో జ్యోతికి ఉన్న పరిచయాలను సూచిస్తున్నట్లు భావిస్తున్నారు. ఆమె పాక్లో ఉన్నతస్థాయి పార్టీలు, అధికారులు, నిఘా వ్యవస్థలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్కు తిరిగివచ్చాక కూడా వారితో టచ్లో ఉన్నట్లు సమాచారం.
విలాసవంతమైన జీవనశైలి, అనుమానాస్పద లావాదేవీలు
భారత పోలీసులు ఆమె ఆర్థిక వ్యవహారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, ఖరీదైన హోటళ్ల బసలు, విదేశీ నగల దుకాణాల్లో సందర్శనలు వంటి విషయాలు ఆమె ఆదాయానికి సంబంధం లేకుండా ఉన్నాయని చెబుతున్నారు. పాక్ పర్యటన “స్పాన్సర్డ్” అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
చైనాలో కొనసాగిన లగ్జరీ లైఫ్
పాక్ పర్యటన అనంతరం జ్యోతి చైనాలోJyoti Malhotra విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తూ, ఖరీదైన షాపింగ్ మాల్స్ సందర్శించినట్లు సమాచారం. దీనిపై కూడా విచారణ కొనసాగుతోంది.